Kodavatiganti Kutumba Rao

    Author: Unknown Genre:
    Rating



    తెలుగు సాహిత్యంలో కధా రచయితగా, సంపాదకుడిగా ఒక ప్రత్యేక స్థానం ఆపాదించుకున్నారు. నాలుగు దశాబ్దాల పాటు అతని కలాన కధలు వెలువడుతూనే ఉన్నాయి. ముప్పై ఏళ్ళ పాటు అజ్ఞాత సంపాదకుడిగా "చందమామ" పత్రికను నడిపించారు. 1950 - 1980 కాలం తెలుగు బాల సాహిత్యం సువర్ణాధ్యాయముగా మార్చారు. ఇలాటి ఘనత ఆపాదించిన వారు - కొడవటిగంటి కుటుంబరావు గారు. వీరు అభిమానులకు కో.కు. గా సుపరచితులు.

    కొడవటిగంటి కుటుంబరావు గారు ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు జిల్లాలో అక్టోబర్ 28, 1909 లో జన్మించారు. 1925 వరకు తెనాలి లో చదువుకున్నారు. తల్లి తండ్రులను చిన్నతనంలోనే కోల్పోయారు. 1927 లో ఏ సి కాలజి నుండి ఇంటర్మీడియట్ లో ఉత్తెర్ణులై విజయనగరం మహారాజ కాలేజి లో బి ఎస్ సి (ఫిజిక్స్) లో విద్యాభాసం సాగించారు. ఈ తరుణంలో రచనా శక్తి పెరిగింది. ఎం ఎస్ సి (ఫిజిక్స్) నిమిత్తం బనారస్ హిందూ విశ్వవిద్యాలయం లో చేరారు, కాని పూర్తి చేయలేదు. తరువాత శింలా, ముంబై తదితర చోట్ల పలు ఉద్యోగాలు చేశారు.

    1952 లో చందమామ పత్రిక నిర్వహణ చేపట్టారు. ఇది వారి జీవితానికి దిశామార్గం ఏర్పరచింది. తెలుగు సాహిత్యం ఒక కొత్త ఆవిష్కారానికి నాంది పలికారు - పిల్లల కధలు, సాహిత్యం పెంపొందించారు. తెలుగు నాట మునుపెన్నడూ లేని పిల్లల కధలు వెలువడ్డం మొదలైయ్యాయి. ఓ సువర్ణాధ్యాయానికి నాందీ పలికింది. ఈ ప్రవాహం అంతారాయం లేకండా నాలుగు దశాబ్దాల పాటు సాగింది. తెలుగు దేశంలో (భారతావని లో) తెలుగు అభిమానాదరణలు అందుకుంది. తెలుగు విద్యార్ధిని విద్యార్ధులలో (ఆమాటకొస్తే పిన్నా పెద్దలలో) ఓ కొత్త ఒరవడి స్థాపించింధి. సాహిత్యాభిమానం పెంచిది. తెలుగు కధల మీద మమకారం పరిపుష్టి చేసింది. ఈలాటి ఉదాహరణ, గత శతాబ్ధంలో మరొకటి లేదు. పండిత విష్ణు శర్మ పంచతంత్రం తరువాత అతి విష్టాధరణ, మన్నన, ఆదరణ గైకొన్న రచన మరోటి లేదు. అందులోనూ ఓ మాస పత్రికకు రెండు తరాల పాటు ఆదరణ లభించిన దాఖలాలు లేవు. ఆ కధలను చదివిన వారు - తెలుగు సాహిత్యాభిమాన సంఘ శాశ్వత సభ్యులు (లైఫ్ మెంబర్స్ / రీడర్స్ ఆఫ్ తెలుగు సాహిత్యం) అని నిస్సంకోచముగా చెప్పవచ్చు. ఇలాటి అపూర్వ అధ్యాయం, ఘట్టం రూపొందిచినవారు శ్రీ కో.కు గారు. తెలుగు భాషా, సాహిత్యం వీరికి ఈ విషయంలో రుణపడి ఉంటుంది.
    పేరు ప్రాపకం లేకుండా, తెర వెనుకనే ఉండి అవిరామ కృషి చేసి సత్ఫలితాలను అందిచారు. పిల్లల మనస్సులలో తెలుగు భాష పట్లా, కధల పట్ల అభిరుచి పెంపొందించారు. చందమామ మళ్ళీ ఎప్పుడొస్తుంది? టపాలో రాగానే ఎవరి చేతికి ముందు చిక్కితే వారు చదివేసి మరొకరికి చాన్స్ ఇస్తారు - ఉదారంగా!... చెప్పుకోడానికి గొప్పగా ఉంది కదూ. కాని ఇది తెలుగు దేశంలో ప్రతీ ఇంటిలో, ప్రతి నెలా జరిగే తంతే. సాహిత్యానికి అంత పట్టు ఉంది. ఇలాటి పట్టు ఆపాదించిన కో కు గారి రచనా కౌసలం, సంపాదకీయం అపూర్వం.

    రచనలు:
    కొడవటిగంటి కుటుంబరావు కధలు - కేతు విశ్వనాధ రెడ్డి ప్రకటన. ఇది చాల మంచి పుస్తకం. తెలుగు సాహిత్యాభిమానులు చదివి తీరాల్సినదే. అలాగే " కుటుంబరావు సాహిత్యం ", కేతు విశ్వనాధ రెడ్డి కో కు గారి కధాభిమానులు తెలుగు నాట చాలా మంది ఉన్నారు. కో కు కధలలో ఓ ప్రత్యేకత ఉంది - కధా వస్తువుకు సంబందించిన ప్రతీ చిన్న విషయం సైతం ఉపేక్షించకుండా వ్రాస్తారు. గొలుసు కధలు కూడా ఉన్నాయి. మగవారిలో ఉన్న నసుగుడు , ఆడవాళ్ళలో ఉన్న జడ్డితనం పట్టుకుని కధలలోకి చక్కగా రంగరించారు. ఈ ప్రక్రియ కధలకి వన్నె తెచ్చింది.

    కొడవటిగంటి కుటుంబరావు గారి, కొన్ని ముఖ్య రచనలు:
    - దీపావళి రాజకీయాలు
    - వారసత్వం
    - గడ్డు రోజులు
    - ఐస్వర్యం
    - సుందరం లేర్న్స్
    - బ్రతుకుభయం
    - అనుభవం
    - మరోప్రపంచం
    - పెళ్ళి చేయకుండా చూడు
    - ప్రేమించిన మనిషి
    - శాత్రీయ విజ్ఞానం
    - తిమింగళం వేట

    చిన్న కధలు:
    చాలా మటుకు మధ్య తర్గతి జీవితం, సగటు మనిషి అనుభావాలను వీరి కధలలో ముడి సరకుగా చెసుకున్నారు. కో కు గారు వ్రాసిన కొన్ని
    చిన్న కదలు:

    - కొత్త పద్ధతులు
    - పీడ కధ
    - అద్దె కొంప
    - కలసి రావాలి
    - నిరుద్యోగం
    - సద్యోగం
    - అష్టకష్టాలు
    - ఉద్యోగం
    - మనము మేము
    - పైకి వచ్చిన వాడు
    - శీల పరిశీలన
    - కొత్త జీవితం
    - నువ్వులు - తెలకపిండి
    - షావుకారు సుబ్బయ్య

    నవలా రచనలు:
    - వారసత్వం
    - చదువు
    - జీవితం
    - పంచకల్యాణి
    - కొత్త అల్లుడు
    - మారు పేర్లు
    - సరితాదేవి డైరీ
    - గ్రహ శకలం

    ప్రాచీన భారతం గురించి 58 వ్యాసాలు వ్రాసి - చరిత్ర వ్యాసాలు గా వెలయించారు.
    నాకు తెలసిన జీవితం గురించే నేను రాశాను అని సవినయముగా చెప్పుకున్నారు కో కు గారు. చెప్ప దగినది కాకపోతే కధ కాదు అని ఓ సందర్బములో అన్నారు.

    దాక్టర్ రోహిణీ ప్రసాద్, తండ్రి గారి మీద ఉన్న గౌరవాభిమానలతో అనేక వ్యాసాలు వ్రాసారు - చాలా మందికి తెలియని విషయాలను వెలుగులోకి తెచ్చారు.

    కొడవటిగంటి కుటుంబరావు - రచనా ప్రపంచం - 1 నుండి 16 సంపుటాలుగా ప్రకటించారు. ఈరకంగా, వీరి రచనలు సాహిత్యాభిమానులకి అందుబాటులో ఉన్నాయి.
    ఆగస్ట్ 17, 1980 లో తుది శ్వాస విడిచారు. తెలుగు సాహిత్యం, ముఖ్యముగా కధా రచన క్షేత్రంలో వీరి ప్రత్యేకత కనిపిస్తూనే ఉంటుంది. చందమామ ఉన్నంత కాలం వీరి కధలు తారసిల్లుతూనే ఉంటాయి. ఇది వారి, తెలుగు వారి అదృష్టం!.
    Courtesy : SiliconAndhra Sujanaranjani